వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
ABN , Publish Date - Jul 03 , 2026 | 07:06 PM
ఫేక్ ఫొటోలు, జీపీఎస్ స్పూఫింగ్తో విధులను ఎగ్గొట్టిన ఇద్దరు కాంట్రాక్ట్ పారిశుధ్య సిబ్బందిని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా విధుల నుంచి తొలగించింది.
ఇంటర్నెట్ డెస్క్: వీధులు శుభ్రం చేయకుండానే చేసినట్టు అధికారులను తప్పుదారి పట్టించి విధులను ఎగ్గొట్టిన ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బందిని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా విధుల నుంచి తొలగించింది. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ దహియా తెలిపిన వివరాల ప్రకారం, వసీమ్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్టు ఏఐ చిత్రాలతో అధికారులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. వీధుల శుభ్రంగా ఉన్నట్టు ఏఐతో ఫొటోలు సృష్టించి అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఈ విషయం బయటపడటంతో అతడిని అధికారులు తొలగించారు. మరో ఘటనలో సోనూ అనే ఉద్యోగి జీపీఎస్ స్పూఫింగ్ సాయంతో తన లోకేషన్ను దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అతడు ఝాజర్లో ఉంటున్నప్పటికీ 50 కిలోమీటర్ల దూరంలోని గురుగ్రామ్లో ఉన్నట్టు చూపించి విధులకు హాజరైనట్టు డేటా అప్డేట్ చేసుకున్నాడు. దీంతో, అతడిని కూడా అధికారులు తొలగించారు.
ప్రాపర్టీ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇద్దరు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డట్టు వెలుగులోకి రావడంతో వారిని కూడా మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. విధుల్లో ప్రమాణిక పద్ధతులను అనుసరించని నీరజ్ వశిష్ట్, అంకుర్ అరోరాలపై వేటు పడింది. ప్రాపర్టీ ఐడీ సంబంధిత కేసుల్లో వారు అనవసర అభ్యంతరాలు లేవనెత్తినట్టు అధికారులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లోని డిజిటల్ నిఘా వ్యవస్థ ఈ నలుగురి నిర్వాకాలను గుర్తించిందని కమిషనర్ దహియా తెలిపారు. ఇలాంటి మోసాలను గుర్తించేందుకు వీలుగా తమ సాఫ్ట్వేర్ నిర్మాణం జరిగిందని అన్నారు. అధికారిక రికార్డులను మార్చేందుకు ప్రయత్నించే వారు తప్పించుకోలేరని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు
దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..